రాష్ట్రంలో 9 కార్పొరేషన్లు, 120 మున్సిపాలిటీల్లో ఓట్ల లెక్కింపునకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి నాగిరెడ్డి స్పష్టం చేశారు. ఓట్ల లెక్కింపునకు సంబంధించి మార్గదర్శకాలు విడుదల చేశామని తెలిపారు. ఈ నెల 27న మేయర్లు, ఛైర్పర్సన్ల ఎన్నికకు పరోక్ష ఎన్నిక ఉంటుందని ఎస్ఈసీ చెప్పారు. ఈ నెల 29న కరీంనగర్ మేయర్ ఎన్నిక ఉంటుందన్నారు. 25వ తేదీ సాయంత్రానికి నగరపాలక, మున్సిపల్ ఫలితాలు వస్తాయని ఆయన తెలిపారు. రాజకీయ పార్టీలు మేయర్, ఛైర్పర్సన్ల పేర్లను ఏ, బీ ఫారాల ద్వారా ఇవ్వాలని సూచించారు. ఈ నెల 26న ఉదయం 11 గంటల వరకు ఏ ఫామ్, 27న ఉదయం 10 గంటల వరకు బీ ఫామ్ ఇవ్వాలన్నారు. రాజకీయ పార్టీలు తమ విప్లను నియమించుకోవచ్చు అని నాగిరెడ్డి సూచించారు. విప్ ఎవరన్నది ఆయా పార్టీలు 26న ఉదయం 11 గంటల వరకు ఇవ్వాల్సి ఉంటుందన్నారు. విప్ జారీ వివరాలను 27 ఉదయం 11:30 గంటల వరకు ఇవ్వాల్సి ఉంటుందని ఆయన చెప్పారు. పరోక్ష ఎన్నికల్లో ఓట్లు సమానంగా వస్తే లాటరీ ద్వారా విజేతను ఎంపిక చేస్తామన్నారు. పరోక్ష ఎన్నిక నేపథ్యంలో రేపు సాయంత్రం నుంచి ప్రత్యేక ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉంటుందని నాగిరెడ్డి పేర్కొన్నారు. ఈ నియమావళి సాధారణ ఎన్నికల ప్రవర్తనా నియమావళి లాగే ఉంటుందని నాగిరెడ్డి స్పష్టం చేశారు. మున్సిపాలిటీల్లో 74.40 శాతం పోలింగ్ నమోదు కాగా, కార్పొరేషన్లలో 58.83 శాతం పోలింగ్ నమోదైంది.